Friday, November 27, 2020

 

రైలు కట్ట కథలు

అనుభవం నేర్పిన పాఠాలు

కొ

త్తగా ట్రాక్ మెయింటెనెన్స్ లోకి వచ్చిన రోజులు. ట్రైనింగ్ పిరియడ్ అంతా, ఏలూరు సెక్షన్ లో విజయవాడ నార్త్ కేబిన్ నుంచి పూళ్ళ వరకు రైల్ లెవల్స్ తీయడంలోనూ, పి.డబ్యు.ఐ శ్రీ పి. వెంకటరావు గారితో భీమడోలు యార్డు లూపు లైన్ రైళ్ళు మార్చడం, స్పెషల్ వర్క్స్ పి.డబ్యు.ఐ శ్రీ నాగేంద్ర ప్రసాద్ వెనుక వెల్డ్ ఫెయిల్యూరు తీసి కట్ రైలు వేయడంతోనే సరిపోయింది. మధ్యలో పి.క్యూ.ఆర్.ఎస్ బ్లాకుల వెనకాల క్లిప్పులు కొట్టించడంతోనూ కొంత కాలం గడిచి పోయింది. కష్టపడి పని చేయడం వచ్చింది కానీ, పని మీద పట్టు రాలేదు. ట్రైనింగ్ అయిపోయాక, పోస్టింగు విజయవాడ డివిజన్ లో బి.సి.ఎం మెషిన్ మీద, తుని ఎ.ఇ.ఎన్ కంట్రోల్ లో. యలమంచిలి – రేగుపాలెం, తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య బి.సి.ఎం తో ట్రాక్ డీప్ స్క్రీనింగ్ చేశాను. తుని పి.డబ్య్లు.ఐ  శ్రీ మల్లాది చక్రవర్తి, యలమంచిలి పి.డబ్ల్యు.ఐ శ్రీ దినవాహి వేంకటరావు గార్లు నేర్పిన చాణక్య నీతి, “ఈత రాని వాణ్ణి తీసుకెళ్ళి చెరువులో పడేస్తే, చావు భయానికి ఈత వస్తుందని”, నా చావు నన్ను చావమని వదిలేశారు. పాపం… పి.డబ్ల్యు.ఐ నారాయణరావు గారు తనకి చేతనైనంత వరకు సహాయం చేసేవారు. ఆ దెబ్బకి; సి.ఎస్.టి -9 స్లీపర్లతో ఉన్న ట్రాక్ మీద మెషీన్ స్క్రీనింగ్ ఎలా చేయాలి, బక్లింగ్ అయిన ట్రాక్ ని ఎలా సరిచేయాలన్నది పూర్తిగా అవగాహన వచ్చేసింది. ఒకటా...రెండా… సి.ఎస్.టి స్లీపర్ ట్రాక్ కనీసం డజను సార్లు బక్లింగ్ అయింది. బి.సి.ఇం తో డీప్ స్క్రీనింగు చేస్తుంటే, తుప్పు పట్టేసిన టైబార్లు రెండు ముక్కలక్రింద విరిగి పోయి, ప్లేట్లు తలోటీ తలోదారిని పోయేవి. ఎన్నోసార్లు టాంపింగ్ మెషిన్ కింద పడేది. పాతకాలం U.T మెషీన్ కావడం వల్ల, క్రింద టర్న్ టేబుల్ ఉండేది. దాంతో అది లేచి నుంచుంటే, కిందనుంచి మళ్ళి ఒకటో రెండో టై బార్లు తొడిగి గేజు సరి చేసి బళ్ళు పంపేవాళ్ళం.  సరే, బి.సి.ఎం మెషీన్ విజయవాడ డివిజల్ లో పని అయిపోవడంతో, సికిందరాబాద్ డివిజన్ కి పంపించేశారు.

అదే సమయానికి పిఠాపురం సెక్షన్ లో విపరీతమైన వెల్డ్ ఫెయిల్యూర్లు, వాటివల్ల కనీసం వారానికి ఒక డీరెయిల్మెంటు, పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాంతో సి.టి.ఇ శ్రీ జి.వి. రత్నంగారు, యుద్ధప్రాతిపదికన సెక్షన్ లోని విరిగిపోయిన వెల్డింగులన్నింటిని తీసేసి, మొత్తం జాయింట్లు కొత్తగా వెల్డింగు చేయాలని ఆదేశించారు. దాంతో సీనియర్ డి.ఇ.ఎన్. శ్రీ మిశ్రాగారు నన్ను పిఠాపురం సెక్షన్ కి తాత్కాలిక ప్రాతిపదికన పంపించడం జరిగింది. ఇంక అక్కడనుంచి, రోజుకి కనీసం నాలుగు విరిగిపోయిన వెల్డింగు జాయింట్లదగ్గర కట్ రైళ్ళు మార్చడం, తక్కువలో తక్కువ ఎనిమిది జాయింట్లు వెల్డింగు చేయించడం … ఇదీ ఉద్యోగం. మొత్తానికి, మూడు నెలల్లో పిఠాపురం సెక్షన్ లో సామర్లకోట నుంచి హంసవరం వరకూ ఎక్కడా విరిగిపోయిన వెల్డింగు జాయింటు లేకుండా చేయగలిగాం.

10 నవంబరు 1992. అప్పటిదాకా ఇలా స్పెషల్ వర్క్స్ తో కాలం గడిపేస్తున్న నాకు, తుని సెక్షన్ ట్రాక్ మెయింటెనెన్స్ కి శ్రీ మల్లాది చక్రవర్తి ప్లేసు లో ఆర్డర్స్ ఇచ్చారు. 16 నవంబరు 1992 తేదీన ఎ.ఇ.ఎన్. తుని శ్రీ అచ్యుతరావు గారికి, చీఫ్ పి.డబ్యు.ఐ శ్రీ రామవరపు నరసింగరావుగారికి రిపోర్ట్ చేసి చార్జ్ తీసుకున్నాను. శ్రీ మల్లాది చక్రవర్తికి నేనే కావాలని ఆయన్ని అక్కడనించి ట్రాన్స్ ఫర్ చేయించానని అనుమానం. పేరుకైతే మెయింటెనెన్స్ లో ఛార్జ్ తీసుకున్నాను కానీ, గ్యాంగుకి పని ఎలా నిర్దేశించాలి, గ్యాంగులతో ఎలా పని చేయించాలి, ట్రాక్ పరిస్థితి ఎలాఉందన్నది తెలుసుకోవడం ఎలా…అన్నీ సందేహాలే. ఎవర్ని అడగాలో తెలీదు. అడిగితే ఎలా ప్రతిస్పందిస్తారో తెలీదు. 21 సంవత్సరాలకే ఉద్యోగానికి వచ్చేశానేమో, అందరూ నన్నో కాలేజీ కుర్రాణ్ణి చూసినట్టే చూసేవారు. దానికి తగ్గట్టు పీలగా, పొడవుగా, గాలికి ఎగిరిపోయేటట్టుండే పర్సనాలిటీ తో చూడగానే లోకువగా ఉండేవాణ్ణి. తెలిసిన విషయాలకంటే, తెలీని విషయాలే ఎక్కువ. భయం భయంగానే శ్రీ రామవరపు నరసింగరావుగారిని అడిగేవాణ్ణి. నన్నొక సోదరుడిగా భావించి ఆయనిచ్చిన ధైర్యం, చూపించిన అభిమానం భవిష్యత్తులో నన్ను నేను ఒక మంచి ఇన్స్పెక్టర్ గా మలచుకోవడంలోనూ, రైల్ కట్టమీద ఎలాంటి పనినైనా చేయగలనన్న నమ్మకాన్ని; నాకు ఇచ్చాయి.

తుని – హంసవరం స్టేషన్ల మధ్యలో చేపూరు ఊరు దగ్గర మూడు స్పాన్ ల ఓపెన్ గర్డర్ బ్రిడ్జి ఉంది. దాదాపు 18 అడుగుల ఎత్తులో ఉంటుంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద ఉడన్ స్లీపర్లు దాదాపుగా పుచ్చిపోయి గేజు, లెవల్ దెబ్బతిని ట్రైన్ వెళ్తుంటే బాగా ఊగుతూఉండేది. చాలా కాలంగా అలా ఉన్నా, ఆ స్లీపర్లు మార్చడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. ఒకటి, రెండు సార్లు ట్రాలీలో వెళ్తుండగా చూసి డి.టి.ఎం.  శ్రీ సుందరరాజు తో చర్చించడం జరిగింది. “చక్రవర్తి అయ్యగారికి చెప్పామయ్యా…కానీ మార్చలేదు” అన్నాడు. ఆ రోజు సాయంత్రం శ్రీ రామవరపు నరసింగరావుగారితో విషయం చెప్పాను. “సార్…స్లీపర్లు బాగా దెబ్బతిని ఉన్నాయి. అలాగే మన దగ్గర కొత్త స్లీపర్లు కూడా ఉన్నాయి. మారిస్తే బాగుంటుంది” అన్నా. వెంటనే ఆయన “సరే.. అలాగే మార్చెయ్. కార్పెంటర్ జగ్గారావు, కమ్మరి మేస్త్రి భూషణం, బిట్రగుంట MP గ్యాంగుని తీసుకెళ్ళి మార్చు” అన్నారు. నేను నసుగుతున్నాను. “ఏంటి ? ఏమన్నా ఇబ్బందా?” అన్నారు. “ఇబ్బంది కాదు సార్. ఇప్పటి వరకు నేను బ్రిడ్జిమీద స్లీపర్ల్ మార్చడం చూడను కూడా లేదు. ఎలా మార్చాలో తెలీదు. మీరు ఒక్కసారి చూపిస్తే, నేను నేర్చుకుని మారుస్తాను” అన్నాను. శ్రీ నరసింగరావుగారు ఒక్కసారి చిద్విలాసంగా నవ్వారు. “చూడు... రావడానికి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ నేను ఒకసారి స్పాట్ కి వచ్చి నిలుచున్నాననుకో… ఏమౌతుందో తెలుసా? చిన్నయ్యగారికి పని చేతకాదు కనక పెద్దయ్యగారు వచ్చి పనిచేయిస్తున్నారు అని గ్యాంగ్ అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఒక సారి నువ్వు లోకువ అయ్యావా ! ఇంక వాళ్ళతో పనిచేయించడం నీకు కష్టమైపోతుంది. నీకంటే బ్రిడ్జి మీద కర్రలు మార్చడం కొత్తగానీ, ఇక్కడ ఉన్న గ్యాంగు, కార్పెంటర్ జగ్గారావు, కమ్మరి మేస్త్రీ భూషణం వీళ్ళంతా చాలా అనుభవం కలవాళ్ళు. నువ్వు అసలు నోరు విప్పద్దు. వాళ్ళనే మార్చమను. ఎలా మారుస్తారో చూడు. బ్రిడ్జిమీద కాషన్ ఆర్డర్ పెట్టు. కర్రలు మార్చేటప్పుడు లైను బ్లాక్ తీసుకో… బానర్ ఫ్లాగ్ పెట్టి మార్చు… వాళ్ళు చేసే ప్రతీ పనీ జాగ్రత్తగా గమనించు. ఒక పుస్తకం లో ఏ పని ముందు చేస్తున్నారు? ఏ పని తరవాత చేస్తున్నారు? సామానులు ఏమేమి తీసుకుళ్తున్నారు? చిన్న…పెద్ద… అన్న ప్రశ్న లేకుండా అన్నివిషయాలు రాసుకో. ఈ బ్రిడ్జి మీద పని అయిపోయాక, తాండవ బ్రిడ్జిమీద కూడా కొన్ని కర్రలు పుచ్చిపోయి ఉన్నాయి. అక్కడ వేరే గ్యాంగు తో ఇదే పని పెట్టుకో. అలాగే గొడిచర్ల దగ్గర పెద్ద బ్రిడ్జి మీద కూడా కర్రలు మార్చాలి. పై వారం అక్కడ డి.టి.ఎమ్. కృష్ణారావు గాంగుతో మార్పించు. ఈ మూడు బ్రిడ్జిలు మార్చావంటే, నీకు ఎక్కడైనా మార్చే అనుభవం వచ్చేస్తుంది. ధైర్యంగా వెళ్ళి మార్చు. ఏమైనా ఇబ్బందైతే నేను చూసుకుంటాను” అంటూ ధైర్యం చెప్పారు. “ఇంతకీ ఎప్పుడు మారుద్దామనుకుంటున్నావు” అన్నారు. “సార్…రేపు సామాను బ్రిడ్జి దగ్గరికి చేర్చి, ఎల్లుండికి కాషన్ ఆర్డర్ ఇచ్చి మారుస్తాను” అన్నా. “సరే ! నేను ఒక పని చేస్తాను. నువ్వు బ్రిడ్జి దగ్గర పని చూసుకో. నేను ట్రాలీ చేసుకుంటూ, హంసవరం స్టేషన్ కి వెళ్ళి, నీ పనయ్యేదాకా అక్కడే ఉంటాను. నేను దగ్గర్లోనే ఉన్నానన్న ధైర్యం నీకుంటుంది. ఏదైనా అవసరమైతే, నేను వెంటనే రావడానికి వీలుగా ఉంటుంది.” అన్నారు.

సరే.. అనుకున్న విధంగానే మర్నాడు స్లీపర్లు లారీ లో లోడు చేసుకుని బ్రిడ్జి దగ్గరకి చేర్చాము. మొత్తం 18 కర్రలు. కార్పెంటర్ జగ్గారావు, కమ్మరి మేస్త్రి భూషణం గర్డర్ మీద నుంచుని, రెవెట్ అరేంజిమెంట్లు అన్ని జాగ్రత్తగా మార్క్ చేసుకున్నారు. హుక్ బోల్టులన్ని ఒకసారి లూజు చేసుకుని, ఆయిల్ పెట్టాడు భూషణం. మద్దిబోయిన కృష్ణయ్య, నల్ల ప్రసాదు, కోటి ప్రకాశరావు, చంద్రయ్య మొదలైన వాళ్ళు స్లీపర్లని బ్రిడ్జి దగ్గరకి చేరవేశారు. మరుసటి రోజు స్లీపర్లు మార్చడానికి అన్నీ తయారు చేసి, తిరిగి ట్రాలీలో తుని వచ్చేశా.

అనుకున్న విధంగానే మొత్తం అందరం పొద్దున్నే ట్రాలీ పెట్టుకుని, బ్రిడ్జి దగ్గరకి బయలుదేరాం. బయలుదేరే ముందు శ్రీ నరసింగరావు గారు పిలిచారు. “ఈ రోజు ఎన్ని కర్రలు మారుద్దామనుకుంటున్నావు” అన్నారు. “సార్…కనీసం ఆరు కర్రలు మారుద్దామనుకుంటున్నాను” అన్నా. “మొదటి రోజు కదా…కంగారు పడకు. స్థిమితంగా చెయ్యి. ఎన్ని వీలైతే అన్నే మార్చు. సేఫ్టీ తో కాంప్రమైజ్ కావద్దు. నేను కూడా నీ వెనకాల ట్రాలీ లో వచ్చి హంసవరం లో ఉంటాను” అంటూ భరోసా ఇచ్చారు. ట్రాలీ బయలు దేరే టప్పుడు ట్రాలీమేను గొర్ల రాంబాబు, “అయ్యా ! కొత్తూరు బ్రిడ్జి దగ్గర నూకాలమ్మ గుడి ఉంది. అమ్మ చాలా శక్తిమంతురాలు. అక్కడ ఎప్పుడు పని చేసినా, కొబ్బరికాయ కొట్టి పని చేయడం ఆనవాయితీ. కొబ్బరికాయ తెమ్మంటారా” అన్నాడు. “సరే ! కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరుబత్తులు, హారతి కర్పూరం కూడా పట్టుకురా” అని చెప్పి, అవి తెచ్చాక. ట్రాలీ బయలు దేరాం. పదిగంటలకి సింహాద్రి ఎక్స్ ప్రెస్ వెళ్ళి పోయాక, రెండు గంటలు ట్రాఫిక్ బ్లాక్ ఇచ్చాడు. అప్పటికే నరసింగరావు గారు హంసవరం స్టేషన్ కి చేరు కున్నారు. అమ్మవారి దగ్గర పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి దణ్ణం పెట్టుకున్నా.  బానర్ ఫ్లాగ్ పెట్టి, కర్రలు మార్చడం మొదలు పెట్టాం. MP గాంగు వాళ్ళు, కార్పెంటర్ జగ్గారావు “అయ్యా ! కర్రలు ఎలా మార్చమంటారు?” అని అడిగారు. “జగ్గారావు ! నేను ఇప్పుడో కొత్త పధ్ధతి చెప్తే అందరికీ అయోమయంగా ఉంటుంది. మీకు చేతనైన పద్ధతిలో మీరు మార్చుకుంటూ వెళ్ళండి. అది తప్పు అనిపిస్తే, నేను కలుగచేసుకుంటాను” అని నేను పక్కన నిలుచున్నాను. వెంటనే గాంగు మొత్తం పనిలోకి దిగారు. కృష్ణయ్య, ప్రకాశరావు, చంద్రయ్య, ప్రసాదు గర్డర్ మీదకి దిగి ఒక చేతితో గర్డర్ పట్టుకుని కర్రలు బయటకి తీయడానికి వీలుగా నుంచున్నారు. డి.టి.ఎమ్. సుందరరాజు ఆయన గ్యాంగు పైనుంచి హుక్ బోల్టులు తీసి వెనక్కి తిప్పి, గర్డర్ మీద జాకీలు వేసి రైలు పైకి లేపారు. వెంటనే ఒక పక్కనించి పాత స్లీపర్లు తీస్తుంటే, రెండో ప్రక్కనుంచి కొత్త స్లీపర్లు ఎక్కించడం ప్రారంభించారు. సరిగ్గా అర్ధగంటలో 12 పాత స్లీపర్లు బయటకి తీయడం, కొత్త స్లీపర్లు ఎక్కించడం కూడా జరిగిపోయింది. జాకీలు కిందికి దించి, తిరిగి హుక్ బోల్టులు బిగించడం మరో పది నిముషాల్లో అయిపోయింది. వెంటనే కంట్రోల్ ఫోనులో, ట్రాఫిక్ బ్లాక్ క్లియర్ చేసి, తరవాత బళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేయడం కూడా జరిగింది. హంసవరం స్టేషన్ లోనుంచి విషయాన్నంతా సమీక్షిస్తున్న నరసింగరావుగారు తిరిగి ట్రాలీ పెట్టుకుని బ్రిడ్జి దగ్గరికి వచ్చారు. “ఎన్ని కర్రలు మార్చారు?” అని అడిగారు. “12 కర్రలు సార్..అని చెప్పాను.” “ధైర్యం వచ్చిందా” అన్నారు. “వచ్చింది సార్” అన్నాను. నవ్వుతూ, “యుద్ధంగెలవాలంటే, ముందు మొదలుపెట్టాలి. గెలిస్తే విజయం. లేకపోతే అనుభవం. ఏదీ వృధా కాదు. All the best” అని నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయారు.

ఆ తరవాత, ఆయన చెప్పినట్టే తాండవ బ్రిడ్జి మీద, గొడిచర్ల బ్రిడ్జి మీద కూడా పని చేసేటప్పటికి, చేయాల్సిందేమిటో, చేయకూడని దేమిటో, సేఫ్టీవిషయం లో గ్యాంగు ఎక్కడ కొంచెం అశ్రద్ధ చూపిస్తున్నారో మొదలైనవి అవగాహనకి వచ్చాయి. గర్డర్ బ్రిడ్జిల మీద పనిచేసేటప్పుడు సాధారణం గా గ్యాంగులు మొండి ధైర్యంతో, స్టేజింగు లేకుండానే ఒక చేతితో గర్డర్ పట్టుకుని ఒంటి చేత్తో పని చేస్తుంటారు. ఎన్నో సార్లు ప్రమాదాలు జరిగినా ఆ పద్ధతి మార్చుకోరు. దాంతో, టైబార్లతో చాలా తేలికగా, అదే విధంగా మనిషి బరువు ఆపేలా, ట్రాలీమీద పట్టుకు వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టుగా; కమ్మరిమేస్త్రి ఆకుపాటి రమణ సాయంతో స్టేజింగు తయారు చేయించి, తప్పని సరిగా వాడేలా చర్యలు తీసుకున్నా. తరవాత ఈ పద్ధతి చాలా ఉపయోగ పడింది.

--లలితా వేంకట సూర్య విశ్వనాథం కూచిభొట్ల

* * *

 రైలుకట్ట కథలు

రైలు బ్రేకేజి

ది 1992 వ సంవత్సరం డిసెంబరు నెల. రాత్రి 12 దాటి ఒక పది నిముషాలైంది. మంచం ప్రక్కనే ఉన్న రైల్వే ఆటో ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగింది. అప్పుడే మూగన్నుగా నిద్రపడుతోందేమో, మొదటి రింగుకే లేపి చెవిలో పెట్టుకున్నా. ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టరు కె.వి.సుబ్బారావు…“విశ్వనాథ్… ఎలమంచిలి – రేగుపాలెం స్టేషన్ల మధ్య అప్ లైను లో 717 కి॥మీ దగ్గర ‘కొండపల్లి’ కోల్ లోడు గూడ్సుట్రయిన్ ఆగిపోయింది. డ్రైవర్ రైలు బ్రేకేజి అని రెపోర్ట్ చేశాడు. కంట్రోల్ నిన్ను అర్జెంటుగా బయలుదేరమంటున్నాడు. దాని వెనకాల కోణార్క్ ఎక్స్ ప్రెస్, పూరీ-తిరుపతి బళ్ళు ఆగిపోతున్నాయి. వెళ్ళి ట్రాక్ అటెండు అయితే కానీ బళ్ళు కదిలే పరిస్థితి లేదు” అని ఫోన్ లో చెప్పాడు.

 

అప్పటికి ట్రాక్ మైంటెనెన్స్ విభాగంలో చేరి సరిగ్గా ఒక నెల కూడా కాలేదు. రైలు కట్టమీద పూర్తి అవగాహన కూడా రాలేదు. ట్రయినింగు పూర్తికాగానే 1992 మే నెలలో హైదరాబాదు నుంచి తునికి బి.సి.ఎం మెషీన్ మీద పి.డబ్ల్యు.ఐ గా, ఎ.ఇ.ఎన్ కంట్రోల్ లో పోస్టింగు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అది పట్టుకుని వచ్చి, విజయవాడ డి.ఆర్.ఎం. ఆఫీసు లో రిపోర్ట్ చేసి, అక్కడినుంచి తుని వచ్చి ఎ.ఇ.ఎన్ శ్రీ అచ్యుతరావు గారికి రిపోర్ట్ చేశాను. ఒక మూడు నెలలు మెషీన్ మీద, తరువాత ఆ మెషీన్ సికిందరాబాదు డివిజన్ కి వెళ్ళి పోవడంతో, స్పెషల్ వర్క్స్ చూడడానికి తాత్కాలికంగా పిఠాపురం సెక్షనుకి పంపించారు. ఈ ఆరునెలల్లో నా పని విధానం చూసిన సీనియర్ డి.ఇ.ఎన్ శ్రీ సంతోష్ కుమార్ మిశ్రా, నన్ను తుని ట్రాక్ మెయింటెనెన్స్ విభాగానికి ఉత్తర్వులివ్వడం జరిగింది. నా సెక్షన్ హంసవరం నుంచి నర్సీపట్నం ఇవతలి వరకు 24 కి॥మీ॥.

 

ఎలమంచిలి సెక్షన్ శ్రీ దినవాహి వెంకట్రావు గారిది. శనివారం వస్తే ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం చెక్కేయడం ఆయనకు షరా మామూలు. ఆయన భార్య సింహాచలం దగ్గర అడవివరం లో పనిచేస్తూ ఉంటారు. ఛీప్ పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ శ్రీ రామవరపు నరసింగరావు గారికి ప్రతీవారం ఇదో పీక మీద కత్తి. ఫామిలీ ఫ్రెండు అయిన పాపానికి వెంకట్రావు గారిని ఏమీ అనలేక, ఆయన విశాఖపట్టణం వెళ్ళిన ప్రతీ శనివారం ఈయనే యలమంచిలి వెళ్ళి కాంపు చేసే వారు. ఈ శనివారం ఆయనకి తప్పని సరి పని ఉండటంతో చాలా బ్రతిమలాడుతూ, “వెంకట్రావుగారూ…ఈ ఒక్క శనివారం మీరు విశాఖపట్నం వెళ్ళొద్దు. నేను కూడా ఉండటం లేదు. ఏదైనా అనుకోని అవాంతరం వస్తే ఇద్దరం ఇబ్బంది పడతాం. అసలే కొత్త ఛీఫ్ ఇంజినీరు చాలా స్ట్రిక్ట్. సెక్షన్ లో ఎక్కడైనా బండి ఆగితే ఛార్జ్ షీట్ ఇస్తున్నాడు” అంటూ ఒకటికి పది సార్లు చెప్పారు. అయినా మామూలే. సరే అని ఊ కొట్టి, ఈయన ఉద్యోగం ట్రాలీమేను సన్యాసిరావు కి అప్పచెప్పి, విశాఖపట్టణం బండి ఎక్కేసారు.

 

కబురు అందుకున్న వెంటనే నైటు వాచ్ మన్ రామారావుకి ఫోనులో, నా ట్రాలీమెన్ కోటిపల్లి సత్యనారాయణ, గొర్ల రాంబాబు, దొడ్డా వెంకటేశ్వర్లు, కమ్మరి మేస్త్రి నాగభూషణానికి కబురు చేసి, వాళ్ళని అవసరమైన సామాను తీసుకుని స్టేషనుకు రమ్మని చెప్పాను. అలాగే ఎలమంచిలిలో ఉండే వాచ్ మేనుకు కూడా స్టేషను మాస్టరు ద్వారా కబురు చేసి ఏడో నెంబరు గాంగు మేస్త్రి నాగం మీరాని మనుషులని తీసుకుని దొంగల గడ్డ దగ్గరకి రమ్మని కబురు చేశాను. మొదటి దొరికే బండిలో తుని నుంచి బయలుదేరి ఆగిపోయిన బండి దగ్గరకి చేరేసరికి కనీసం గంటా…గంటన్నర పడుతుంది. అదే విషయం కంట్రోలర్ కి చెప్పి అంతవరకు సింగిల్ లైన్ వర్కింగ్ లో బళ్ళు పంపించవలసి ఉంటుందని చెప్పాను. పదినిముషాల్లో ట్రాలీమెన్, కమ్మరి మేస్త్రీలతో సహా తుని స్టేషనుకి చేరుకున్నాను. అదృష్టం కొద్దీ డౌను లైనులో అప్పుడే గూడ్సు ట్రయిన్ ఒకటి బ్లాక్ అవడంతో, ఆ బండిలో మమ్మల్నందర్నీ ఎలమంచిలి వెళ్ళడానికి ఎక్కించారు.

 

సుమారు గం॥ 1:30 ని॥ల కల్లా మేము ఎక్కిన గూడ్సు ట్రయిన్ స్పాటుకి చేరుకుంది. మమ్మల్ని సెక్షన్ లో దింపేసి, ముందుకు వెళ్ళిపోయింది. డిసెంబరు నెల చలి…గజ గజలాడిస్తోంది... అమావాశ్య దగ్గరలో అనుకుంటా.. చీకటి కూడా చిక్కగా ఉంది… చేతిలో టార్చిలైటు పట్టుకుని ఆగిపోయిన కొండపల్లి ఇంజిన్ దగ్గరికి చేరుకున్నాం… డ్రయివర్ చిట్టిబాబు.. పరిచయస్థుడే… గార్డు గాబ్రియేలు... నా ఎదరగుండా క్వార్టర్లోనే ఉంటుంటాడు. నన్ను చూడగానే… “సార్.. ఇంజిన్ నుంచి 24 బోగీ క్రింద సార్… రైలు విరిగిపోయింది. తుని వైపు పట్టా దాదాపుగా అడుగు క్రిందకి దిగిపోయింది. గాప్ కూడా బాగా లాగింది” అన్నాడు గాబ్రియేలు. నెమ్మదిగా  చూసుకుంటూ రైలు విరిగిన దగ్గిరకి వెళ్ళాం. అదే టైముకి నాగం మీరా కూడా ఒక ముగ్గురు గాంగ్ మన్ లని తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. పరిస్థితి చూడగానే ఏం చేయాలో అర్థం కాలేదు. వెల్డింగు జాయింటుకి మధ్యలో రైలు విరిగి పోయి, దాదాపుగా ఎనిమిది అంగుళాలు గ్యాపు వచ్చేసింది. తుని వైపు స్లీపరు బాగా దూరంగా ఉండటంతో, రైలు కమ్మి దాదాపుగా అడుగు క్రిందకి దిగి పోయింది. సాధారణంగా రైలు జాయింట్లు రెండు స్లీపర్లకి మధ్యలో ఉండేలా అమర్చబడి ఉంటాయి. అప్పుడు పొరపాటున వెల్డింగు జాయింటు విరిగినా, వెంటనే పట్టీలు కట్టి సరిచేసి పంపించడానికి వీలౌతుంది. కానీ ఇక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. రైలు క్రిందకి దిగిపోవడమే కాదు, గ్యాప్ కూడా చాలా ఎక్కువగా, పట్టీ కట్టడానికి కూడా వీలుగా లేదు.  వాగన్ కి వెనక వైపు బోగీ లో ముందు చక్రం తుని వైపు రైలు మీద, వెనక చక్రం యలమంచిలి వైపు రైలు మీద ఉన్నాయి. రెండు చక్రాలు ఏదో ఒక ప్రక్కకొస్తే కానీ కనీసం రైలుకి పట్టీకట్టే ప్రయత్నం కూడా చేయలేం. అప్పటికే టైం రెండు దాటి పది నిముషాలైంది. అంటే, బండి ఆగి పోయి దాదాపు రెండు గంటలు పైన అయింది. ఏమి చేయడానికీ పాలు పోవడం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు నా నిర్ణయం కోసం చూస్తున్నారు.

 

కొంచెం ఆలోచించి, డ్రైవర్ చిట్టిబాబుతో, “చిట్టిబాబు గారూ… కప్లింగు కట్ చెద్దామా ? కప్లింగు కట్ చేసి, బండిని ఒక బోగీ లెంతు ముందుకు తీసుకువెళ్తే, పట్టీ కడదాం” అన్నాను. “చాలా రిస్కు సార్… ఎఇర్ ప్రెషర్ అఫెక్ట్ అయి, బ్రేకులు పట్టేసాయంటే బండి కదలదు సార్.. తరవాత అందరం ఇబ్బంది పడతాం. అంతే కాదు, రైలు కి రైలు కి దాదాపు అడుగు ఎత్తు తేడా ఉంది. బండి లాగేటప్పుడు చక్రం సరిగా లాండ్ కాకపోతే, మొత్తానికి డీరైలుమెంటు అవుతుంది. అంత రిస్కు అవసరమా?” అన్నాడు. “చిట్టిబాబు గారూ.. పరిస్థితి చూస్తున్నారు కదా ! ఏదో ఒక పక్కకి చక్రం కదిలితే గానీ మనం ఏమీ చెయ్యలేం.  లేదంటే, బి.డి స్పెషల్ రావలసిందే. ధైర్యం చెయ్యకపోతే ఏమీ కాదు. కావాలంటే కప్లింగు కట్ చెయ్యిమని రాత పూర్వం గా ఇస్తాను” అన్నాను. “సరేసార్.. మీరు మీ ఉద్యోగానికి రిస్కు తీసుకుంటున్నారు, గార్డు గాబ్రియేలు కూడా ఒప్పుకుంటే, నేను రెడీ సార్” అన్నాడు చిట్టిబాబు. గాబ్రియేలు కూడా, “మీరు రిస్కు తీసుకుంటున్నారు కాబట్టి సరే సార్” అన్నాడు. ఏదైతే అయిందని భగవంతుడిమీద భారం వేసి, కప్లింగు కట్ చేశాము. చేతి లాంతరు తో సిగ్నల్ చూపిస్తుంటే, చిట్టిబాబు బండిని నెమ్మదిగా  ముందుకు కదిలించాడు. అంతటి చలిలో కూడా అందరికీ చెమటలు పడుతున్నాయి. ఎవ్వరం ఊపిరి తీస్తున్నట్టు లేదు. నరాలు తెగే ఉత్కంఠ. నెమ్మదిగా రెండవ చక్రం కూడా తుని వైపు రైలు మీదకి దిగింది.

 

చిట్టిబాబు అలాగే నెమ్మదిగా ట్రైనుని ఒక వాగన్ లెంతు ముందుకి తీసుకు వెళ్ళాడు. వెంటనే ట్రాలీ మేనులు, గ్యాంగు కలిసి కిందికి దిగిపోయిన స్లీపర్లని, గునపాలతో పైకి లేపి, ప్యాకింగు చేశారు. నెమ్మదిగా రెండు రైలు పట్టాలు ఒక లెవల్ కి లేపగలిగాము. జాగుల్డ్ ఫిష్ ప్లేట్లు అమర్చి, ఒక పక్క రెండు బోల్టులు, ఒక పక్క క్లాంపు కట్టి, క్రింద ఒక చెక్క బ్లాకు పెట్టి, పాకింగ్ చేశాము. అంతా సవ్యంగా ఉందనుకున్న తరువాత, గార్డు గాబ్రియేల్ కి, డ్రైవర్ చిట్టిబాబుకి బండిని బ్యాక్ చేసి, కప్లింగు వేయడానికి రెడీ చెప్పాను. గాబ్రియేల్ సిగ్నల్ చూపిస్తుంటే, చిట్టిబాబు నెమ్మదిగా ట్రైను బ్యాక్ చేశాడు. సి.బి.సి కప్లింగు పూర్తిగా కూర్చుందని నిర్ధారించుకున్నాక బ్రేక్ పైపులు కనెక్ట్ చేసి, బ్రేక్ పవర్ చెక్ చేసుకున్నాడు చిట్టిబాబు.  బ్రేక్ పవర్ పూర్తిగా వచ్చిందని తేల్చుకున్నాక, “సర్.. బండి రెడీ… మీరు ట్రాక్ సురక్షితంగా ఉందంటే, బయలు దేరదాం” అన్నాడు. నేను వెంటనే, ట్రాక్ 30 కి॥మీ॥ వేగానికి ఫిట్ అని సర్టిఫికేట్ రాసి, చిట్టిబాబు కి ఇచ్చి, ఆ ఫిట్ మెమో పక్కన రేగుపాలెం స్టేషన్ లో ఉచ్చి తరవాత వచ్చే అన్ని బళ్ళకి కాషన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పాను. అప్పటికి టైము దాదాపుగా మూడు కావస్తోంది. స్పాట్ నుంచి బయలుదేరిన కొండపల్లి గూడ్సు ట్రైను రేగుపాలెం చేరి, దాని తరవాత వచ్చే బండి స్పాట్ దాటితే కానీ, నేను స్పాట్ వదిలి వెళ్ళలేను. మొత్తానికి, మరో ఇరవై నిముషాల తరవాత రెండోబండి కాషన్ ఆర్డర్ లో రైలు విరిగిన స్పాట్ ని దాటుకుని వెళ్ళింది. దాంతో అందరం ఆ చీకట్లో నడుచుకుంటూ ఎలమంచిలి స్టేషన్ కేసి బయలుదేరాం.

 

ఉదయాన్నే చీఫ్ పి.డబ్య్లు. ఐ శ్రీ రామవరపు నరసింగరావుగారు యలమంచిలి స్టేషనుకి వచ్చారు. ఆయనకి రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పాను. “ఏం చేశావు… మళ్ళీ చెప్పు” అన్నారు. చెప్పాను. ఒక్కసారిగా గుండెలమీద చేయి వేసుకున్నారు. “నీకు కప్లింగ్ కట్ చేయడానికి ధైర్యం ఎలా వచ్చింది?” అన్నారు. “అంతకంటే మార్గం కనపళ్ళేదు సార్” అన్నా… “717 కిలోమీటర్ దగ్గ్ర గ్రేడియంట్ ఎంతో తెలుసా ?” అన్నారు. “తెలియదు సర్” అన్నా… “అక్కడ గ్రేడు 1 ఇన్ 100 రైజింగ్. ఒకవేళ బ్రేక్ పవర్ ఫెయిల్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా…ఫార్మేషన్ వెనకాల ముక్క దొర్లడం ప్రారంభించిందంటే, కనీసం బయ్యవరం గేటు దాకా ఎక్కడా ఆగదు. అప్పటికే యలమంచిలి యార్డులో రెండు లైనుల్లో రెండు బండ్లు ఆగి పోయి ఉన్నాయి.ఈ ముక్క తిన్నగా వెళ్ళి, మెయిన్ లైను లో ఆగి ఉన్న గూడ్సు ట్రయిన్ నో, లేకపోతే రాంగ్ లైనులో పంపించడానికి షంటింగ్ తీసుకుంటున్న పూరీ తిరుపతి ఎక్స్ ప్రెస్ నో ఢీ కొట్టి ఉంటే, పరిస్థితి ఏంటి? ఎంత రిస్కు తీసుకున్నావో నీకేమైనా అర్థం అవుతోందా? నీ అదృష్టం, నా అదృష్టం బాగుండబట్టి ఈ రోజు ఇలా తెల్లారింది.” అంటూ కశింకోట వైపు తిరిగి, సత్యన్నారాయణ స్వామి కి ఒక నమస్కారం పెట్టారు. ఆయన చెప్పింది అర్థం అవడానికి నాకో రెండు నిముషాలు పట్టింది. ఆ తరవాత ఒక్కసారిగా ఆలోచన స్థంభించి పోయింది. నేను చేసింది ఎంత మూర్ఖమైన పనో...ఎన్ని ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నానో అర్థం అయింది. నిజంగా సత్యమైన దేవుడు, ఆ సత్యనారాయణుడే మమ్మల్నందర్నీ కాపాడాడని మనఃస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకున్నా...కొసరుగా నా కిలాంటి అనుభవం మిగిల్చిన శ్రీ దినవాహి వెంకట్రావు గారికి కూడా.

జీవితం అనుభవాల్నిచ్చి పాఠాలు నేర్పుతుందంటారు. కానీ ఇలాంటి అనుభవాల్నించి నేర్చుకున్న పాఠాలు జీవితాల్ని నేర్పుతాయి.

 

--లలితా వేంకట సూర్య విశ్వనాథం కూచిభొట్ల

* * *

Monday, February 24, 2020

చాలా రోజుల నుంచి అంటే నన్ను నేను మోసం చేసుకున్నాట్టవుతుంది..... నిజానికి చాలా సంవత్సరాలనుంచి నా రచనా వ్యాసంగాన్ని పక్కన పెట్టేశాను. కారణాలనేకం ఉన్నా, ప్రధాన కారణం మాత్రం ఉద్యోగ వత్తిడి అని చెప్పక తప్పదు. పొద్దుపొడవక ముందే బయలుదేరితే, పొద్దుపోయాక తిరిగి ఇంటికి చేరడం... అలసటతో మంచం చేరి ముసుగు తంతే తిరిగి మర్నాడు పొద్దున ... రాట్నంలా గిరగిర తిరగడం... ఈ చక్రభ్రమణంతో జీవితం మరీ రొటీన్ అయిపోయింది. అభిరుచులే కాదు  అభినివేశాలు కూడా మారిపోయాయి. సృజనాత్మకత ఎక్కడికో పారిపోయింది. కధలు, కవితలు, నాటికలు, నాటకాలు...అన్నీ కాలంతో పాటు గిరగిర తిరుగుతూ ఎక్కడో మూలలో ఇరుక్కుపోయాయి. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుచేస్తే,,,,, ఒహో... ఒకప్పుడు కవితలు రాశాను కదా... నా కథ ఫలానా పత్రికలో ముద్రించారు కదా అనుకుంటూ ఒక్క నిట్టూర్పు తప్ప ... ఊహల్లో విహరించడం మానేశాను. ఎందుకో ఈ రోజు స్నేహితులు గుర్తుచేస్తే, నేను కూడా బ్లాగ్ రాసేవాణ్ణి కదా అని గుర్తొచ్చి, ఆ పేజీ ఎక్కడుందో అని వెతుక్కుని, ఇదిగో ఇలా ఈ నాలుగు మాటలు .... 
దేవుడా కాపాడు నా దేశాన్ని...
చదువుకున్న నిరక్షరాస్యుల నుంచి....
కళ్ళున్న గుడ్డివాళ్ళ నుంచి...
చెవులున్న బధిరుల నుంచి....
విచక్షణ ఉన్న మూర్ఖుల నుంచి...

దొంగాడికి రాజ్యం ఇస్తే రక్షణ ఎక్కువట....
దోపిడి దారుకు పెత్తనం ఇస్తే ...
కొత్తగా దోచుకోవటానికి ఏమీ లేదు కనుక
దాచుకోవడం మినహా కొత్త దందాలుండవట....

నోటుకు వోటు తప్పురా బాబూ అంటే....
దోచుకున్నది మన సొమ్మేకదా....
ఇలా తిరిగి తీసుకుంటే తప్పేంటనే వాదన..
ఐదువందలు తీసుకుంటే కక్కుర్తి కానీ...
ఐదువేలు తీసుకుంటే రాయల్టీ అట...

ఐదుసంవత్సరాల మన తలరాత అంటే...
అరవై సంవత్సరాలుగా మారనిది...
ఐదు సంవత్సరాలలో ఏం మారుతుంది... నీ పిచ్చి గానీ
అయినా.... మనకి తలలుంటే కదా రాతలు...
తలలన్నీ తలర్లకిచ్చేసాక... ఇంకా దేనికి ఆలోచనలట...

"అందరూ దొంగలే అయినపుడు...
మన దేశమే పెద్ద కంబళి అయినపుడు...
చట్టం కొందరికే చుట్టం అయినపుడు....
చట్ట సభలు చెత్త సభలు అయినపుడు...
ఎవ్వరూ కాపాడలేరీ దేశాన్ని"... అంటుంటే

అడుగుతున్నా ఆపుకోలేక్ ఆక్రోశాన్ని...
దేవుడా నువ్వైనా కాపాడు నా దేశాన్ని....
వినిపించు వేదమంత్రాల్ని....
నిలబెట్టు నీ గీతా సారాన్ని...

Saturday, August 17, 2013

Tuesday, March 20, 2012

UGADI SUBHAKANKSHALU

నందననామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.
             ఉగాది తెలుగువారి పండుగలలో ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సంవత్సరాదిగా (కొత్త సంవత్సరానికి ప్రారంభంగా) జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు నూతన సంవత్సరానికి నాందిగా ఈ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. పల్లెల్లో ఈ పండుగను కొత్త అమావాస్య పేరుతో వ్యవహరిస్తారు. ఈ రోజునుంచి వసంతఋతువు ప్రారంభమవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం, చంద్రుని గమనాన్ని అనుసరించి, ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. గ్రహ, నక్షత్ర గతులను బట్టి, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది ? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి ? దేశంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది? వర్ష ఫలాలు, పంటలు మొదలైనవి ఏ విధంగా ఉంటాయి మొదలైనవి పంచాంగ పరంగా వి శ్లేషణ చేస్తారు. పంచాగ శ్రవణానికి ఉగాది రోజున చాలా ప్రాముఖ్యాన్నిస్తారు. దక్షిణభారత దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర లలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మహరాష్ట్రలో ఈ పండుగను గుడిపడవగా వ్యవహరిస్తారు. 

          మామిడి తోరణాలను, బంతిపూదండలను గుమ్మాలకు కట్టి, కొత్తబట్టలతో ……బంధుమిత్రులతో ఈ పండుగను ఇంటిల్లిపాది కలిసి ఆనందంగా చేసుకొంటారు. ఉగాది నాడు షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితం అన్నిరుచుల కలయిక అని తెలియచేస్తుందీ ఉగాది పచ్చడి. ఆరోగ్యపరంగా ఈ ఉగాది పచ్చడిలో వేసే వేపపువ్వు, మామిడి కాయ, చెరకు, బెల్లం, కొత్తచింతపండు మొదలైనవన్నీ పైత్యాన్ని తగ్గించి జీర్ణశక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. ఉగాది నాడు సాధారణంగా ప్రతి ఇంట్లో చేసుకొనే వంటకాలు పులిహోర, బొబ్బట్లు.సంవత్సరాది నాడు ఆనందంగా ఉంటే, ఆ సంవత్సరమంతా ఆనందంగా గడుస్తుందని విశ్వాసం. అందుకే అందరూ సంవత్సరాదిని ఆనందంగా గడపడానికి చూస్తారు. 

          ఉగాదినాడు ఇంటిల్లిపాది తలస్నానం చేసి, దేవుడికి పూజ చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించి, కొత్తసంవత్సరంలో ఏవిధమైన విఘ్నాలు లేకుండా చూడమని ప్రార్ధిస్తారు. తరువాత కొత్త సంవత్సరమంతా భోగ భాగ్యాలతో ఉండేలా చూడమని లక్ష్మీదేవిని అర్చిస్తారు. నవగ్రహాలను వారి శుభదృష్టిని అనుగ్రహించేలా వేడుకుంటారు. తరువాత వండుకున్న పిండివంటలను భగవంతునికి నివేదించి ఇంటిల్లి పాది భుజిస్తారు. 
          ఈ నందననామ ఉగాది మీ అందరికి సకల సౌభాగ్యాలను అందించాలని ఆశిస్తూ....
                                   మీ విశ్వనాధ్ కూచిభొట్ల

Sunday, January 29, 2012

Radha Saptami

రధ సప్తమి



ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమిగా జరుపుకోవడం ఆచారం. "ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్" అని వేదోక్తి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే ఏకైక భగవానుడు కాబట్టే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడన్నారు. సూర్యనారాయణమూర్తి అత్యల్ప సంతోషి కూడా. "ఆదిత్యో నమస్కార ప్రియః". ఆయన ఎదురుగా నిలచి చేతులు రెండు శిరసు పై జోడించి నమస్కరిస్తే చాలు, అడిగినవన్నీ ప్రసాదించే దైవం ఆయన. ఇంద్రధనుస్సులోని ఏడు రంగులను ప్రతిఫలించే ఏడు అశ్వాలను పూన్చిన, ఒకే చక్రం కలిగిన రథం సూర్యనారాయణుని వాహనం. సూర్యుని ద్వాదశ నామాలు - మిత్ర, రవి, సుర్య, ఖగ, అహను, పూషణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. సూర్యనారాయణ స్వామికి భారతదేశంలో కోవెలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒరిస్సాలోని కోణార్క్ లోని సూర్యదేవాలయం సముద్రతీరంలో వెలసింది. కాలక్రమేణా శిధిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయంలో ప్రస్తుతం పూజాధికాలు జరగటంలేదు. రెండవది, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం దగ్గరలో గల అరసవల్లి. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యమైనది మరియు పురాతనమైనది. ప్రతీ సంవత్సరం, రధసప్తమి రోజు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయి. సంవత్సరం మొత్తంమీద ఈ విశేషం ఈ ఒక్క రోజు మాత్రమే కనిపిస్తుంది. ఈ వేడుక చూడడానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు వస్తుంటారు. మూడవదేవాలయం తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో కల సూర్యన్ కోవిల్. భారతదేశంలో ఇక్కడ ఒక్క చోటమాత్రమే నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలున్నాయి.


రథ సప్తమినే మాఘ సప్తమి, జయ సప్తమి, మహా సప్తమి అని కూడా వ్యవహరిస్తుంటారు. రథ సప్తమి రోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడు.ఈ ప్రవేశ కాలాన్ని చాల పుణ్య ప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టే భీష్ముడు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేవరకు వేచి యుండి దేహ త్యాగం చేశాడు. ఈ రోజున మరణించినవాళ్ళు నేరుగా వైకుంఠం చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి.


రథసప్తమినాడు, తెల్లజిల్లేడు ఆకుమీద రేగిపండు ఉంచి, శిరసుమీద, రెండు భుజాలమీద పెట్టుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి శిరస్నానమాచరిస్తే ఎటువంటి రోగాలైనా నయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు విశేషమైనవని ఆయుర్వేదం కూడా తెలియచేస్తోంది.


స్నానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం పఠిస్తూ స్నానం చేయాలి.

సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా

సప్తార్క ప్రమాణాయ సప్తమీ రథసప్తమీ

కొంతమంది ఈ క్రింది మంత్రాన్ని పఠించాలని చెప్తారు

యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం జచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజం యచ్చ జాతాజాతం చ యత్పునః

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తకే

సప్తవ్యాధిసమాయుక్తం హర మాకరి సప్తమి.

స్నానం చేసిన తరువాత సూర్యునికి ఈ క్రింది మంత్రం చెపుతూ అర్ఘ్యం ఇవ్వాలి.

సప్త సప్త వహప్రీత సప్తలోక ప్రదీపన

సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

సూర్యభగవానుడిని శోడశోపచారాలతో అర్చించి, చిక్కుడు కాయలతో, చిక్కుడు ఆకుతో రథాన్ని తయారుచేసి దానిలో ఆవు పిడకలపై, ఆవుపాలతో చేసిన బియ్యం పాయసాన్ని నైవేద్యం గా అర్పిస్తే ఆ సూర్యనారాయణుడు అఖండ ఆయురారోగ్యాలను ఇస్తాడు.